విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన విలువల విద్యా సదస్సు శ్రీ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం అత్యంత విజయవంతంగా జరిగింది. ఈ సదస్సులో ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రధాన ప్రవచనం అందించారు. తిరుపతి జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి దాదాపు 1200 మంది విద్యార్థులు పాల్గొని ఈ ప్రవచనాన్ని ఆసక్తిగా వినడం విశేషం.
చాగంటి కోటేశ్వరరావు గారి సందేశం
ప్రవచనంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు పూర్తిగా విద్యార్థులను ఉద్దేశించి పలు మార్గదర్శక సూచనలు చేశారు. మహాత్మా గాంధీ గారి సాదాసీదా జీవన విధానం, నిజాయితీ, క్రమశిక్షణ, పరిశుభ్రతపై ఆయన చూపిన కట్టుబాటును వివరించారు. “వ్యక్తి మారితే సమాజం మారుతుంది” అనే గాంధీజీ ఆలోచనను ప్రతి విద్యార్థి తన జీవితంలో ఆచరణలో పెట్టాలని సూచించారు.
పరిశుభ్రత ఆరోగ్యానికి తొలి మెట్టు అని పేర్కొంటూ, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పాఠశాల, ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. “మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది” అని ఉద్ఘాటిస్తూ ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం అవసరమని వివరించారు.
జపాన్, స్వీడన్ దేశాల్లో చెత్త నిర్వహణ, రీసైక్లింగ్ పద్ధతులను ఉదాహరణగా చెబుతూ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, ప్రకృతి మరియు పర్యావరణాన్ని రక్షించాలని విద్యార్థులకు సూచించారు.
సెల్ఫోన్ అధిక వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్ప్రభావాలను వివరించి, సమయాన్ని వృథా చేయకుండా పుస్తక పఠనం, క్రీడలు, యోగాభ్యాసం వంటి మంచి అలవాట్లను అలవరచుకోవాలని సూచించారు. “నైతిక విలువలు లేని ఏ పనైనా విషంతో సమానం” అని స్పష్టం చేస్తూ, సత్యం, క్రమశిక్షణ, గౌరవం, సేవాభావం వంటి సద్గుణాలు ప్రతి విద్యార్థి జీవితానికి పునాది కావాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ సందేశం
కార్యక్రమాన్ని ఉద్దేశించి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు రేపటి భారత దేశ నిర్మాణ శిల్పులు అని పేర్కొన్నారు. చిన్న వయసులోనే మంచి అలవాట్లు, సమయపాలన, క్రమశిక్షణ అలవరచుకుంటే భవిష్యత్తులో గొప్ప వ్యక్తులుగా ఎదగవచ్చని సూచించారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని, కానీ దానికి బానిసలుగా మారకూడదని హెచ్చరించారు. విలువలతో కూడిన విద్యే సమాజానికి ఆదర్శ పౌరులను అందిస్తుందని తెలిపారు.
ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ సందేశం
కార్యక్రమాన్ని ఉద్దేశించి SCERT Andhra Pradesh డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, పాఠ్యాంశాల బోధనతో పాటు విలువల విద్యను సమానంగా అందించడం అవసరమని తెలిపారు. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఇలాంటి సదస్సులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ విలువల విద్యా సదస్సు విద్యార్థుల్లో సానుకూల ఆలోచన, ఆరోగ్య చైతన్యం, పర్యావరణ బాధ్యత, నైతిక బలాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. పాల్గొన్న విద్యార్థులు ఈ సదస్సు ద్వారా తమ జీవితంలో అమలు చేయదగిన అనేక విలువలను తెలుసుకున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్ గారు, ఏపిసి సమగ్ర శిక్ష గౌరీ శంకర్ గారు, పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉష గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు చక్కగా సమాధానాలు అందించారు. అలాగే విద్యార్థులు ప్రదర్శించిన “గురు అష్టకం” నృత్య రూపకం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు కూడా కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Информация по комментариям в разработке