యక్ష ప్రశ్నలు | Yaksha Prasnalu | Rajan PTSK | Ajagava

Описание к видео యక్ష ప్రశ్నలు | Yaksha Prasnalu | Rajan PTSK | Ajagava

వ్యాస మహాభారతంలో చెప్పబడిన 124 యక్ష ప్రశ్నలు

చిన్నపిల్లలెవరైనా తల్లిదండ్రులను అదేమిటీ ఇదేమిటీ అంటూ ప్రశ్న మీద ప్రశ్న వేస్తుంటే.. ఓరేయ్ ఇంకా యక్షప్రశ్నలు ఆపు అంటూ విసుక్కుంటూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అసలీ యక్షప్రశ్నలు ఏమిటి? ఎవరు ఎవరిని అడిగారు? ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పారు? అసలు మొత్తం ఇవి ఎన్ని ప్రశ్నలు? చిరస్మరణీయమైన ఈ ప్రశ్నలు వెనుక ఉన్న కథ ఏమిటి? మొదలైన విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం.

సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే [email protected] కు email చెయ్యండి.

అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి.

మహాభారతంలోని అరణ్యపర్వం చివరిలో మనకీ యక్షప్రశ్నలు కనబడతాయి. శకుని మాయాజూదం వల్ల ఓడిపోయిన పాండవులు 12 సంవత్సరాల వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యవలసి వస్తుంది. ఇక తమ అరణ్యవాసం త్వరలో ముగియబోతుందనగా పాండవులు కామ్యకవనం నుండి ద్వైతవనం వచ్చి నివసిస్తుంటారు. ఇదిలా ఉండగా, ఒకనాడొక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చి, చెట్టుకొమ్మలకు తగిలించుకున్న తన అరణి అటుగా పరిగెడుతున్న ఒక జింక కొమ్ముల్లో చిక్కుబడిపోయిందని, ఆ జింక అరణ్యంలోకి పరిగెట్టి పోయిందనీ, తన అరణి తనకు తిరిగి తెచ్చివ్వమనీ ప్రాధేయపడతాడు. అరణి అంటే హోమం చేసుకోవడానికి.. మథించి అగ్ని పుట్టించే కర్ర. పాపం ఆ బ్రాహ్మణుని దీనాలాపన విని, ధర్మరాజుతో సహా మిగిలిన పాండవులంతా కూడా ఆయుధాలు ధరించి, అడవిలోకి పరుగుతీశారు. కానీ వారికా జింక కనిపించినట్టే కనిపించి, మరలా దొరకకుండా పారిపోయింది. వెతకి వెతకి అలసిపోయిన ఆ పాండవులంతా ఒక మర్రిచెట్టు క్రింద కూర్చుని అలసట తీర్చుకోసాగారు. అప్పుడు నకులుడు ధర్మరాజుతో.. “అన్నయ్యా! మనం ఎన్నడూ ధర్మం తప్పలేదు. ఏ విషయంలోనూ అలసత్వం చెయ్యలేదు. అందరికీ మంచి చేసే మనం ఎందుకని ఇంతలా కష్టపడవలసి వస్తుంది” అన్నాడు విచారంగా. అప్పుడు ధర్మరాజు.. “నాయనా నకులా! ఆపదలకు హద్దులూ కారణాలూ ఉండవు. ఇదివరకు మనం చేసిన పాపపుణ్యల కారణంగానే సుఖదుఃఖాలు వస్తుంటాయి. అన్నిటికీ కర్మే మూలకారణం” అన్నాడు. అప్పుడు భీముడు కలగజేసుకుని.. “ఆనాడు ద్రౌపదిని దాసీ స్త్రీవలే సభలోనికి ఈడ్చుకువచ్చినవాడిని చంపకుండా వదిలేశాను చూశావా? ఆ తప్పుపని వల్లే ఈరోజు మనకీ కష్టం” అన్నాడు. అప్పుడు అర్జునుడు.. “ఆనాడు కర్ణుడు నిండు సభలో మనల్నీ, ద్రౌపదినీ అవమానిస్తూ మాట్లాడుతుంటే, అతడిని తెగవేయకుండా ఉండిపోయాను. ఆ కర్మవల్లే మనకీ దుస్థితి” అన్నాడు. ఇంతలో సహదేవుడు.. “మాయాజూదంలో ఆ శకుని మనల్ని ఓడించినప్పుడే వాడిని చంపెయ్యాల్సింది. కానీ వదిలివేశాను. ఆ పాపమే ఇప్పుడు మనకీ దురవస్థ కలిగించింది” అన్నాడు. అప్పుడు ధర్మరాజు వారిని వారిస్తూ, నకులునివైపు తిరిగి నాయనా అందరం దాహంతో అలమటించిపోతున్నాం. ఈ దగ్గరలో మంచినీళ్ళ సరోవరం ఏదన్నా ఉందేమో, ఈ చెట్టెక్కి చూడు” అన్నాడు. నకులుడు వెంటనే చెట్టెక్కి.. అక్కడకు కాస్త దూరంలో నీళ్ళకొలను చుట్టూ పెరిగే వృక్షాలను, నీటి పక్షులను చూశాడు. ఆ విషయమే అన్నగారికి చెప్పాడు. అటుపై అతని ఆదేశంతో.. దొప్పలతో నీళ్ళు తీసుకువస్తానని చెప్పి, ఆ సరోవరం వైపుగా బయలుదేరాడు.


అక్కడకు వెళ్ళిన నకులుడు, గబగబా కొలనులో నీటిని దోసిలితో తీసుకుని త్రాగబోయాడు. ఇంతలో అతనికి.. “నాయనా ఆగు. ఇది నా సరోవరం. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాక మాత్రమే నీవు ఈ నీళ్ళు త్రాగాలి” అన్న అశరీరవాణి వినిపించింది. కానీ అప్పటికే విపరీతమైన దాహంతో ఉన్న నకులుడు, ఆ మాటలను పట్టించుకోకుండా, ఆ జలాన్ని త్రాగాడు. అంతే వెంటనే అతను అచేతనుడై పడిపోయాడు. ఎంతకీ నకులుడు రాకపోయేసరికి సహదేవుడిని పంపించాడు ధర్మరాజు. అతను కూడా ఆ అశరీరవాణి హెచ్చరికను లెక్కచేయకుండా ఆ సరోవరంలో నీటిని త్రాగి, అచేతనంగా పడిపోయాడు. వాళ్ళ కోసమని ఒకరి తరువాత ఒకరుగా వెళ్ళిన అర్జునుడు, భీముడూ కూడా అలానే అచేతనులుగా మారిపోయారు. నీళ్ళకోసం వెళ్ళిన తన తమ్ముళ్ళెవరూ తిరిగిరాకపోవడంతో ధర్మరాజు కూడా ఆ సరోవరం వద్దకు వెళ్ళాడు. అక్కడ అలా పడి ఉన్న తన తమ్ముళ్ళను చూసి విలపించాడు. వారి శరీరంపై గాయలు లేకపోవడంతో, వాళ్లు ఎవ్వరితోనూ పోరాడలేదన్న విషయం అర్థమవుతోంది. ఆ నీళ్ళలో దుర్యోధనుడు విషప్రయోగం చేశాడేమో అన్న అనుమానం కలిగిందతనికి. కానీ అలా అచేతనంగా పడి ఉన్న తన తమ్ముల ముఖాలలో అటువంటి ఛాయలేవీ కనిపించలేదు. ధర్మరాజుకు ఏమి చెయ్యాలో పాలుపోలేదు. అలా అనేక ఆలోచనలు తనను చుట్టుముడుతుండగా, అన్యమనస్కంగానే ఆ సరస్సు దగ్గరకు వెళ్ళాడు.


అప్పుడు మరలా ఆ శరీరవాణి.. “రాజకుమారా! నేను చేపలనూ, నాచునూ తిని బ్రతికే కొంగను. నీ తమ్ముళ్ళను యమలోకానికి పంపించింది కూడా నేనే. నీవైనా నా ప్రశ్నలకు జవాబు చెప్పి, అప్పుడు ఆ నీళ్ళు త్రాగు. లేదంటే నీవుకూడా యమపురికి పోకతప్పదు” అంది. అప్పుడు ధర్మరాజు.. “నీవు కచ్చితంగా పక్షివి మాత్రం అయ్యుండవు. నా తమ్ముళ్ళను ఈవిధంగా అచేతనలుగా మార్చివేశావంటే నీవు ఏ దేవతా పురుషుడవో అయ్యుండాలి. దయచేసి నీవెవరో చెప్పు” అన్నాడు వినయంగా. అప్పుడు తాటిచెట్టంత ఎత్తున్న ఒక భయంకరాకారుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతగాడు ధర్మరాజుతో.. “రాజా! నేనొక యక్షుడను. ఈ సర్ససు మీద అధికారం నాదే. నీ సోదరులు నా మాటను అలక్ష్యం చేసి ఇలా దుర్మరణం పాలయ్యారు. నువ్వు వారికి మల్లే దుస్సాహసం చేయకుండా, నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు” అన్నాడు. అప్పుడు ధర్మరాజు “ఓ యక్షా.. నా బుద్ధిమేరకు నేను నీ ప్రశ్నలకు జవాబివ్వడానికి ప్రయత్నిస్తాను. అడుగు” అన్నాడు. అప్పుడా యక్షుడు తన ప్రశ్నల్ని అడగటం మొదలుపెట్టాడు. అతని ప్రతీ ప్రశ్నకూ ధర్మరాజు సమాధానం కూడా ఇవ్వసాగాడు. ఆ ప్రశ్నోత్తరాలు ఇలా కొనసాగాయి.

Rajan PTSK

#YakshaPrasnalu #Ajagava #Bharatam #RajanPTSK

Комментарии

Информация по комментариям в разработке